యాదాద్రిక్షేత్రంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2020-12-06T04:36:33+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం కార్తీక పూజల సందడి నెలకొంది.
యాదాద్రి టౌన్, డిసెంబరు 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం కార్తీక పూజల సందడి నెలకొంది. శివకేశవులను దర్శించుకున్న భక్తులు కార్తీక దీపారాధనలు, వ్రతపూజల్లో పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర కార్తీక మాసం కావడంతో యాదాద్రి క్షేత్ర సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో సేవా మండపాలు హరిహరుల దర్శన క్యూలైన్లు, తిరువీధులు సందడిగా మారాయి. స్వామికి సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో 773 మంది దంపతులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో రూ.3.86లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. వేకువజామునే సుప్రభాతంతో ఆరంభమైన నిత్యోత్సవాలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి.
గర్భగుడిలో బంగారు బావి
ప్రధానాలయంలోని గర్భగుడి గుహలో కొలువైన పంచనారసింహుల నిత్య పూజోత్సవాల నిర్వహణకోసం బంగారు బావిని నిర్మించనున్నారు. బంగారు బావికోసం ఇత్తడితో తయారు చేసిన గంగాళం (బావి), చేతబొక్కెన(బకెట్), స్వామివారి సింహాసనాలు సిద్ధమయ్యాయి. ఇత్తడి తొడుగులకు బంగారు పూత పూసే పనులకు దేవస్థానం సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం బంగారు బావి సింహాసనానికి బంగారు పూత కో సం అవసరమయ్యే ముడి బంగారాన్ని బాలాలయంలో దేవస్థాన ఈవో గీతారెడ్డికి దిల్సుఖ్నగర్కు చెందిన దాతలు గోవుల అనంతమ్మ నారాయణ, గోవుల లక్ష్మీరాములు అందజేశారు.