ఓటు నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-10T05:52:18+05:30 IST
ఓటు నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర సూచించారు.
నల్లగొండ, డిసెంబరు 9: ఓటు నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఓటరు నమోదు నిర్వహించాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలన్నారు. నార్కట్పల్లిలోని 144, 145, 146 పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. వలసదారులను పూర్తిగా విచారించిన తర్వాతే ఓటును నమోదు చేయాలని కోరారు. కనగల్ మండలం పర్వతగిరి గ్రామంలోని 188, 189వ పోలింగ్ కేంద్రాలు, గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలోని 45, 46 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, నల్లగొండ, దేవరకొండ ఆర్డీవోలు జగదీశ్వర్రెడ్డి, గోపీరామ్, తహసీల్దార్లు పాల్గొన్నారు.