ఉర్సులో భక్తుల సందడే.. సందడి
ABN , First Publish Date - 2020-12-13T05:36:04+05:30 IST
మత సామరస్యానికి ప్రతీకైన హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా షాఖాద్రీ దర్గా ఉత్సవాల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలు దర్గాను సందర్శించడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

నల్లగొండ కల్చరల్, డిసెంబరు 12 : మత సామరస్యానికి ప్రతీకైన హజ్రత్ సయ్యద్ లతీఫుల్లా షాఖాద్రీ దర్గా ఉత్సవాల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలు దర్గాను సందర్శించడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. రెండో శనివారం సెలవు రోజు కావడంతో ప్రజలు పెద్దసంఖ్య ఉత్సవాలకు హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫాయితాలు ఇచ్చి మొక్కులు సమర్పించారు. విద్యుత్దీపాలతో దర్గా దేదీప్యమానంగా వెలిగింది. గుట్ట మెట్ల వద్ద వెలిసిన దుకాణాలు సైతం బిజిబిగా మారాయి. అన్ని రకాల దుకాణాలు ఉండడంతో ప్రజలకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. చిన్నపిల్లలకు సంబంధించిన ఆహ్లాదభరితమైన ఆట వస్తువులతో ఉల్లాసంగా గడిపారు. దీంతో దర్గా ప్రాంతం ప్రజలతో కిక్కరిసిపోయింది. సాయంత్రం వేళలో ప్రజలు పెద్దసంఖ్యలో ఉర్సు ఉత్సవాలకు హాజరుకావడంతో జాతరలాగా సాగింది. వ్యాపారం ముమ్మరంగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఉర్సులో పాల్గొన్నారు.