నేలవాలుతున్న మహావృక్షాలు

ABN , First Publish Date - 2020-12-07T05:02:36+05:30 IST

భువనగిరి పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపుల పచ్చతోరణంలా ఉన్న మహావృక్షాలు కనుమరుగవుతున్నాయి.

నేలవాలుతున్న మహావృక్షాలు
భువనగిరిలో మహావృక్షాలను మిషన్‌తో కోస్తున్న సిబ్బంది

భువనగిరిలో చెట్ల నరికివేత ప్రారంభం 

రూ.5.31లక్షలతో 112 చెట్ల తొలగింపు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 6: భువనగిరి పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపుల పచ్చతోరణంలా ఉన్న మహావృక్షాలు కనుమరుగవుతున్నాయి. దశాబ్ధాలుగా చిరు వ్యాపారులకు నీడనిచ్చిన ఆ చెట్లను రహదారి విస్తరణలో తొలగిస్తున్నారు. నరికివేత పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. భువనగిరి పట్టణ ప్రధాన రహదారిని 100 ఫీట్లకు విస్తరిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా మారుతి షోరూం నుంచి ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స డిగ్రీ కళాశాల వరకు 4.5 కిలోమీటర్ల మేర ఇరువైపులా ఉన్న 112 చెట్లను రూ.5.31 లక్షల వ్యయంతో తొలగిస్తున్నారు. చెట్ల నరికివేతను మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు పర్యవేక్షిస్తున్నారు. మొదటి రోజున నాలుగు వృక్షాలను నరికి వేయగా, 20 రోజుల్లోపు మిగతా చెట్ల తొలగింపు పూర్తి చేయనున్నారు. అటవీ శాఖ అనుమతులతో తొలగించనున్న 112 చెట్లలో వేప-73, పిట్టకళ-12, కానుగ-12, రావి-7, చింత-6, సుబాహుల్‌-2 ఉన్నాయి. చెట్ల నరికి వేత సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌, ట్రాన్స్‌కో, పోలీస్‌, మునిసిపల్‌ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 


ఓ వైపు హరితహారం.. మరోవైపు నరికివేత 

ఓ వైపు కోట్లాది రూపాయలు వెచ్చించి, విడతల వారీగా హరితహారం నిర్వహిస్తున్న ప్రభుత్వం, దశాబ్దాల కాలం నాటి మహా వృక్షాలను నరికివేయడం సమంజసం కాదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మహా వృక్షాలను తొలగించడం సరికాదని, ప్రత్యామ్నయంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో ఇతర ప్రాంతాల్లో నాటాలని కోరుతున్నారు. ఇందుకోసం అవసరమయితే న్యాయస్థానం లేదా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు. 


Updated Date - 2020-12-07T05:02:36+05:30 IST