ప్రశ్నించే గొంతును గెలిపించండి
ABN , First Publish Date - 2020-12-31T04:38:19+05:30 IST
ప్రశ్నించే గొంతుకైన తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోరారు.
మోటకొండూరులో తీన్మార్ మల్లన్న
మోటకొండూరు, డిసెంబరు 30: ప్రశ్నించే గొంతుకైన తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోరారు. బుధవారం పాదయాత్రలో భాగంగా మోటకొండూరుకు చేరుకొని ముందుగా స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను, మీడియాను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు, మీడియా విఫలమైనప్పుడు ప్రజలే నిజమైన ప్రతిపక్షమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశపడి మోసపోయిన నిరుద్యోగ యువకుల్లారా, విద్యావంతుల్లారా, మేథావుల్లారా ఆలోచించి తనకు ఓటేయాలన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని తుంగలో తొక్కి ఒక ముఖ్యమంత్రి ఎర్రబెల్లి ఫాంహౌస్నుంచి వచ్చారని, రాబోయే రోజుల్లో జనువాడ ఫాంహౌజ్ నుంచి మరో ముఖ్యమంత్రి రానున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగులు, యువకులు పాల్గొన్నారు.