చేనేత నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-08-20T11:19:29+05:30 IST

చేనేత నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

చేనేత నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి: టీజేఎస్‌  అధ్యక్షుడు కోదండరాం


చండూరు / సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 19 : చేనేత నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన చండూరు, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లో చేనేత కార్మికుల దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఫలితంగా చేనేత రంగం ఛిన్నాభిన్నమై కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. పనుల్లేక చేనేత కార్మికులు పస్తులుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నేతన్నలు నేస్తున్న మాస్కులు ధరిస్తున్న మంత్రులకు వారి బాధలు  కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నాయకులు చేనేత వస్త్రాలను కొనుగో లు చేయాలన్నంత మాత్రాన రూ.1200కోట్ల వస్త్రాలను కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. ఎంతో మందికి సాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను విస్మరించడం తగదన్నారు. చేనేత కార్మికులకు పనులు కల్పించడంతో పాటు ఇళ్లు లేని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.


చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమాల్లో జేఏసీ కన్వీనర్‌ జూలూరి ఆంజనేయులు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె వినయ్‌, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి నాగిళ్ల శంకర్‌, మండల ఇన్‌చార్జి కట్ట సైదులు పద్మశాలి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపోలు నారాయణ, కోమటి వీరేశం, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు సూరపల్లి భాస్కర్‌, నాయకులు లక్ష్మయ్య, శ్రీనివాస్‌, నర్సింహ, లింగస్వామి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-20T11:19:29+05:30 IST