అభివృద్ధిలో తెలంగాణ వెనుకంజ: కోదండరాం
ABN , First Publish Date - 2020-12-20T05:06:47+05:30 IST
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో వెనుకబడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు.

ఆత్మకూర్(ఎస్)/మద్దిరాల/నూతన్కల్, డిసెంబరు 19: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో వెనుకబడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. మండలకేంద్రంలోని మోడల్స్కూల్లో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే ఆశించిన ఫలితాలను పొందుతామని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, మాండ్ర మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. మద్దిరాలలో జరిగిన సమావేశంలో కోదండరాం మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ నీళ్లను దోచిపెడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వేణురాజు, చందు, శ్రీధర్, శ్రీను, ప్రియాంక, అనిల్ పాల్గొన్నారు. నూతన్కల్లో జరిగిన సమావేశంలో సాబాది వెంకట్రెడ్డి, గంట నాగయ్య, మల్లయ్యయాదవ్, డేవిడ్కుమార్ పాల్గొన్నారు.