అనుమానం..వేధింపులకు వివాహిత బలి

ABN , First Publish Date - 2020-12-30T05:58:19+05:30 IST

అనుమానం..వేధింపులు వెరసి వివాహిత బలవన్మరణానికి కారణమయ్యాయి.

అనుమానం..వేధింపులకు వివాహిత బలి
పూజశ్రీ (ఫైల్‌)

యాదగిరిగుట్ట మండలం చొల్లేరులో ఘటన


యాదాద్రి రూరల్‌, డిసెంబరు 29: అనుమానం..వేధింపులు వెరసి వివాహిత బలవన్మరణానికి కారణమయ్యాయి. వివాహిత మరణంతో రెండు నెలల పసిగుడ్డు తల్లిలేని వాడయ్యాడు. వివాహిత తల్లిదం డ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలంలో చొల్లేరు గ్రామానికి చెందిన బోడ దశరథ భారతమ్మ దంపతుల కుమారు బోడ వెంకటేశ్వర్లుకు పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చిట్టిమల్ల సునీత అంజయ్య దంపతుల కూతురు పూజశ్రీ అలియాస్‌ శ్రావణి(23)ను 2019 నవంబరు 14న వివాహం చేశారు. ఒప్పుకున్న విధంగా రూ.10లక్షలు నగదు బంగారం ఆభరణాలు అన్నింటిని ముట్టజెప్పారు. నాలుగు నెలల అనంతరం పూజశ్రీ గర్భవతి అయింది. దీంతో కుటుంబంలో కలహాలు ప్రారంభం అయ్యాయి. పలుమార్లు అత్తమామ, భర్తకు నచ్చజెప్పినప్పటికీ పూజశ్రీపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మాయి గర్భవతి అయినందున తల్లిగారి ఇల్లు పోచంపల్లికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి భర్త పోచంపల్లికి వెళ్లకుండా ఫోన్లుచేసి గర్భం వచ్చింది తన వల్ల కాదని.. భార్యను వేధింపులకు గురిచేసేవాడు.


రెండు నెలల క్రితం పూజ బాలుడికి జన్మనిచ్చింది. ఈ విషయం భర్త వెంకటేశ్వర్లు, అత్తామామకు తెలిపినప్పటికీ చూడడానికి రాకపోగా తిరిగి ఫోన్‌ద్వార అనేక బూతుమాటలతో మానసికంగా వేధించారు. మనస్తాపంతో పూజశ్రీ డిసెంబరు 10న ఇంట్లో ఉన్న యాసిడ్‌ (ద్రావణం) తాగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన  హైదరాబాద్‌లో ఆసుపత్రికి తరలించారు. 18 రోజులుగా చికిత్సపొందుతున్నప్నటికీ శరీరంలోని భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. చివరకు తన భర్తను చూడాలని కలవరిస్తూ ఉండడంతో తల్లిదండ్రులు పూజను తీసుకొని మంగళవారం ఉదయం 9గంటలకు చొల్లేరు గ్రామానికి చేరుకున్నారు. లేవలేని స్థితిలో  ఉండి పడకపైనే ఉన్న పూజను ఇంట్లోకి రానీయకుండా ముందుగా ఇంటికి తాళంవేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. పూజ భర్త వెంకటేశ్వర్లు తనకు రక్షణ కావాలని తనపై దాడిచేయడానికి తన భార్య కుటుంబ సభ్యులు వస్తున్నారని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరకున్నారు.  ‘నీ భార్య నీతో ఉండాలని కోరుకుంటోంది. కొన్నిరోజులు ఇక్కడే ఉంచుకోవాలి’ అని వెంకటేశ్వర్లుకు పోలీసులు సర్ధిచెప్పడటంతో గేటు లోపల వేశారేతప్ప ఇంట్లోకి అనుమతించలేదు. ఇంటిమందే ఉన్న తన భార్య, పసిగుడ్డును సైతం కనీసం చూడకుండా వదిలిలేశాడు.


దీంతో పూజశ్రీ సాయంత్రం 5గంటల ప్రాంతంలో తన ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబ సభ్యులు తన కూతురి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి పసిగుడ్డుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాత్రి వరకు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు గ్రామంలోని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించడానికి ట్రాక్టర్‌ సిద్ధం చేశారు. పోచంపల్లిలో కేసు నమోదు అయ్యిందని బాధితులకు నచ్చజెప్పడానికి ప్రయాత్నాలు చేస్తున్నారు. అంతకు ముందే వివాహిత కుటుంబ సభ్యులు పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Updated Date - 2020-12-30T05:58:19+05:30 IST