రెండేళ్లుగా ప్రోత్సాహకమేదీ?

ABN , First Publish Date - 2020-11-25T06:01:24+05:30 IST

పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ఇన్‌సెంటివ్‌ను రెండేళ్లుగా విడుదల చే యకపోవడంతో పాడి రైతులు ఆగ్రహించారు.

రెండేళ్లుగా ప్రోత్సాహకమేదీ?
భువనగిరి పట్టణంలో పాడిరైతుల ర్యాలీ

పాడిరైతుల ఆవేదన 

యాదాద్రిలో ర్యాలీ

సమస్య పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరిక

యాదాద్రి,నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ఇన్‌సెంటివ్‌ను రెండేళ్లుగా విడుదల చే యకపోవడంతో పాడి రైతులు ఆగ్రహించారు. వెంటనే ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని, పశు బీమా సమస్యను పరిష్కరించాలని పాడి రైతులు మంగళవారం యాదాద్రి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. సమస్యలను పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. భువనగిరి పాలశీతలీకరణ కేంద్రం నుంచి కలెక్టరేట్‌ వరకు 5కి.మీ మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు వినతిపత్రం అందజేశారు. నార్మూల్‌, విజయ డైయిరీ పాల రైతులకు రెండేళ్లుగా రూ.20కోట్ల ఇన్‌సెంటివ్‌ పెండింగ్‌లో ఉందని, దీన్ని వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. పశువులు మృతిచెందితే బీమా క్లయిమ్‌ను వెంటనే సెటిల్‌ చేయాలని, 50శాతం సబ్సిడీపై దాణా, మందులు, గడ్డివిత్తనాలు సరఫరా చేయాలన్నారు. రాష్ట్రంలో పాడి రైతుల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే అముల్‌, నందిన వంటి డెయిరీలపై సుంకం విధించాలన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉన్న రైతులకు రూ.1.60లక్ష రుణపరపతి కల్పించాలని, మొబైల్‌ పశువైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పాడి రైతుల సహజ మరణానికి రూ.10లక్ష బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పాడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ పడమటి పావని ఆధ్వర్యంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు వినతి పత్రం అందజేశారు. వీరి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రుశోభారాణి, కాంగ్రెస్‌ ఆలేరు నియోజకర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఉన్నారు. కార్యక్రమంలో సాగర్‌, మదర్‌ డైయిరీ డైరెక్టర్లు శ్రీకర్‌రెడ్డి, శ్రీశైలం, గాల్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, నాయకులు మామిడాల సోమయ్య, శీలం వెంకట నర్సింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, గడ్డం నాగరాజు, క్రిష్ణ, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T06:01:24+05:30 IST