అనుమతి ఉంటేనే ఆంధ్రాలోకి అనుమతి
ABN , First Publish Date - 2020-05-09T09:43:07+05:30 IST
ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వారు క్వారంటైన్లో
వలస కూలీలకు తప్పిన అడ్డంకులు
కోదాడ రూరల్ / దామరచర్ల / నాగార్జున సాగర్, మే 8 : ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వారు క్వారంటైన్లో ఉంటేనే అనుమతి ఇస్తామని ఏపీ చెక్పోస్టు అధికారులు పేర్కొనడంతో హైదరాబాద్ నుంచి కార్లలో ఆంధ్రాకు వెళ్లేందుకు వచ్చిన కొంతమంది శుక్రవారం వెనక్కి వెళ్లారు. రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీలోకి వెళ్లేందుకు వస్తుండగా అధికారులు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి బీహార్, ఛత్తీ్సఘడ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు వారి వాహనాల్లో స్వరాష్ర్టాలకు వెళ్లేందుకు మాత్రం సూర్యాపేట కలెక్టర్ జారీ చేసిన పాస్లతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటుచేసుకుంటేనే అనుమతి ఇస్తున్నారు. వలస కూలీలను కాలినడకన వెళ్లేందుకు అనుమతించట్లేదు. రెండు రోజుల కిందట ఒడిషా రాష్ర్టానికి చెందిన వలస కూలీలు తాము వాహనాలు తీసుకొని వెళ్లేందుకు తమ దగ్గర డబ్బులు లేవని నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణ అధికారులు అనుమతి ఇచ్చినా ఆంధ్రా అధికారులు అనుమతి ఇవ్వకపోవటంతో వారు చెక్పోస్టు వద్దనే 12 గంటలపాటు నిరీక్షించారు. అనంతరం వారిని ఖమ్మం రైల్వేస్టేషన్కు తరలించారు. ఇటీవల తెలంగాణలో ఉన్న ఒడిశా, బీహార్ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలను వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు సైతం అనుమతించకపోవటంతో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, కృష్జాజిల్లా కలెక్టర్తో మాట్లాడడంతో కూలీలను తరలించేందుకు అనుమతించారు.
ఆంధ్రాకు రావాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని లేకుంటే క్వారంటైన్లో 28రోజులు ఉండాల్సిందేనని అక్కడి అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్కు వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్ స్టాంప్ వేసుకుంటేనే అనుమతిస్తున్నారు. దామరచర్ల మండలంలోని వాడపల్లి, సాగర్ చెక్పోస్టుల వద్ద ఆంధ్రా అధికారులు అనుమతి ఉన్న వాహనాల రాకకు అనుమతిస్తున్నారు.