ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-10-04T10:17:57+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష
నల్లగొండ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జిల్లా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ముందుగా ఓటర్ల నమోదుపై అంతా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 40వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నవారు ఉన్నారని, ముందుగా ఆ కుటుంబాలను కలవాలన్నారు. ఆ కుటుంబంలోని పట్టభద్రులందరినీ ఓటరుగా నమోదు చేయించాలన్నారు. పాత ఓటరు లిస్ట్ చెట్లుబాటుకానందున అందరినీ మళ్లీ నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. రెండో దశలో పార్టీ సభ్యులు కాని వారు, మన పార్టీ నేతల మిత్రులు, సానుభూతిపరులను గుర్తించి నమోదు చేయించాలన్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం, ఆస్తుల నమోదు, రైతు వేదికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
సమావేశంలో మంత్రి జగదీ్షరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎన్నికల నల్లగొండ పార్లమెంటు ఇన్చార్జి తక్కెలపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 15వేల దరఖాస్తు ఫారాలను టీఆర్ఎస్ అధిష్ఠానం పంపింది. ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా ఇన్చార్జులను నియమించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2,500 మందికి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. తొలి రెండు రోజులు దరఖాస్తులు నింపే కార్యక్రమం వేగంగా సాగినా, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించాలన్న నిబంధన కారణంగా ఓటరు నమోదులో కొంత జాప్యం జరుగుతోంది. ఈనెల 3వ తేదీ నాటికి నల్లగొండ పార్లమెంటు పరిధిలో పూర్తి చేసిన 14వేల దరఖాస్తులను టీఆర్ఎస్ నేతలు పట్టభద్రుల నుంచి సేకరించినట్టు తెలిసింది.