రైతు చట్టాలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-12-26T05:59:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు.

రైతు చట్టాలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం
పెద్దవూరలో ప్రధాని మోదీ సందేశాన్ని రైతులతో కలిసి వింటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి
పెద్దవూర, డిసెంబరు 25 :
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి అన్నారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా  ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించడానికి పెద్దవూరలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నూతన చట్టాల గురించి ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. చట్టాల్లో ఏవైనా తప్పులుంటే సవరించడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎరువులు కొనడానికి నానా ఇబ్బందులు పడ్డారని, దేశంలో బీజేపీ అఽధికారంలో రాగానే రైతులు కష్టాలు వరుసగా తీరుస్తున్నారని అన్నారు. తెలంగాణలో మూసివేసిన రామగుండం ఫ్యాక్టరీని రూ.5వేల కోట్ల వ్యయంతో తిరిగి తెరిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో ఎరువుల ధరలు మరింత తగ్గనున్నాయన్నారు.  రైతాంగం తమ భూముల్లో ఉన్న లక్షణాలను బట్టి ఏఏ పంటలు సాగు చేసుకోవాలో తెలిపే నేల ఆరోగ్య పరీక్షల కార్డులను కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. నేల ఆరోగ్య పరీక్షల కార్డులకు సంబంధించిన నిధులు తీసుకున్నారే తప్ప దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రైతులందరూ లబ్ధి పొందడానికి కిసాన్‌ సమ్మన్‌ యోజన పథకం కింద రూ.2వేల చొప్పున  దేశం మొత్తం రూ.18వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారన్నారు. దేశవ్యాప్తంగా మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసే బీజేపీలోకి పెద్ద ఎత్తున యువత చేరుతోందన్నారు. కార్యక్రమంలో సాగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంకణాల నివేదితరెడ్డి, జిల్లా నాయకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహ, తొడిమ మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:59:10+05:30 IST