అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-12-18T05:00:44+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అన్నారు.

సూర్యాపేట(కలెక్టరేట్), డిసెంబరు 17 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన 1వ, 7వ స్థాయి, 2, 4వస్థాయి సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అందజేసే సబ్సిడీని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు లబ్ధిపొందేలా చైతన్యపర్చాలని ఆమె సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆమె అన్నారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి
జాజిరెడ్డిగూడెం మండలంలోని బొల్లంపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ అన్నారు. దీనికి తోడు 100 యూనిట్ల సబ్సిడీని మంజూరు చేయడంలేదని, మిషన్ భగీరథ నీటి సరఫరా సకాలంలో జరగడంలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ జడ్పీటీసీ కృష్ణకుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో జడ్పీసీఈవో విజయలక్ష్మి, జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.