కరోనా తీవ్రతపై చర్చేదీ..?
ABN , First Publish Date - 2020-04-01T11:50:02+05:30 IST
సమస్త మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి పట్టణ వాసులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై

భువనగిరి టౌన్, మార్చి31: సమస్త మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి పట్టణ వాసులను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించకుండానే భువనగిరి మునిసిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మంగళవారం సాగింది. చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో 6 ఎజెండా అంశాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.
ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ ఆవరణలో 2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెన్సీకి అప్పగించడం, హైదరాబాద్ చౌరస్తాలో ఉన్న 15గుంటల గ్రామ కంఠం స్థలాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణానికి, రూ.26లక్షల పట్టణ ప్రగతి బిల్లుల చెల్లింపు, హెచ్బీ కాలనీలో రూ.5లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ పైపులైన్ శుభ్రం చేసే పనులకు కౌన్సిల్ పరిపాలన ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సూచన మేరకు సమీకృత మార్కెట్ నిర్మాణానికి ఉత్సాహం చూపుతున్న అధికారులు టౌన్హాల్ నిర్మాణానికి కూడా అదే తరహా చిత్తశుద్ధి చూపాలన్నారు. వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ టి నాగిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.