ప్రేమ పెళ్లి చేసుకున్న వెంటనే ఊహించని షాక్.. ఓ మహిళ ఎంట్రీతో సీన్ రివర్స్..!
ABN , First Publish Date - 2020-06-18T16:32:36+05:30 IST
ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్న ఓ యువకుడు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా; తనను మోసం చేశాడని మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రేమించిన అమ్మాయితో వివాహం
రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి
మోసం చేశాడని మరో మహిళ ఫిర్యాదు
హుజూర్నగర్, సూర్యాపేట (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్న ఓ యువకుడు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా; తనను మోసం చేశాడని మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హుజూర్నగర్కు చెందిన ఓ యువతి, బూరుగడ్డకు చెందిన మిన్నయ్యలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో అమ్మాయిని తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలనుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
అదే సమయంలో బూరుగడ్డకు చెందిన ఓ మహిళ మిన్నయ్య తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రమాదంలో చనిపోగా తనకు ఒక కుమార్తె ఉందని, ఎనిమిదేళ్లుగా తనతో ఉంటూ మాయమాటలు చెప్పి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మాత్రం తన భర్తపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, ఎన్ని సమస్యలు ఉన్నా తాను మిన్నయ్యతోనే ఉంటానని చెబుతోంది.