రైతుపై మూడు ఎలుగుబంట్ల దాడి
ABN , First Publish Date - 2020-10-03T10:13:31+05:30 IST
మెదక్ జిల్లా హవేళీఘణపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ రైతుపై ఎలుగుబంట్లు దాడి

తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం
హవేళీఘణపూర్, అక్టొబరు 2: మెదక్ జిల్లా హవేళీఘణపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ రైతుపై ఎలుగుబంట్లు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన నార్ల మొగులయ్య తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లాడు. అది అటవీ ప్రాంతం కావడంతో పొలం వద్దే పొంచి ఉన్న మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా మొగులయ్యపై దాడి చేశాయి. దీంతో తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన తోటి రైతులు ఎలుగుబంట్లను తరిమికొట్టి మొగులయ్యను హుటాహుటిన మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు బాధితుడికి ఆర్థిక సాయమందించాలని సర్పంచ్ సంధ్యారాణి, ఎంపీటీసీ జ్యోతి కోరారు.