ఉల్లి మంటలు
ABN , First Publish Date - 2020-10-04T10:38:18+05:30 IST
ఉల్లి ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పది రోజులుగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.
మార్కెట్లో కిలో రూ.50
వర్షాలకు మురిగి పోయిన పంట
పాత ఉల్లిగడ్డకు డిమాండ్
మెదక్, అక్టోబరు 3: ఉల్లి ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పది రోజులుగా ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ సీజన్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో స్థానికంగా రైతులు వేసిన ఉల్లిపంట మురిగిపోయింది. దాంతో ప్రస్తుతం కొత్త పంట లేకుండా పోయింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు వేసిన దాదాపు 5 వేల ఎకరాల ఉల్లి సాగులో 2 వేల ఎకరాల్లో వర్షాలకు పాడైపోయింది. దీంతో స్థానిక ప్రజలకు అవసరమైన మేర సరఫరా కాకపోవడంతో డిమాండ్ పెరిగిపోతోందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన హోల్సెల్ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచేస్తున్నారని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.50 నుంచి రూ.60 వరకు చేరువవుతోంది.
రాయితీపై ఉల్లి విత్తనాల సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో ఉద్యానశాఖ అధికారులు ఉల్లి విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేసేవారు. మూడేళ్లుగా రాయితీపై సరఫరాను నిలిపివేశారు. దీంతో రైతులు కిలో విత్తనానికి రూ.2,600 వరకు వెచ్చించాల్సి వస్తోంది. గతంలో మెదక్ జిల్లాలో సుమారు రూ.7 వేల ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేసేవారు. మల్కాపూర్, తూప్రాన్, టేక్మాల్, పాపన్నపేట, రేగోడ్, అల్లాదుర్గం, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో రైతులు ఉల్లిసాగు చేసేవారు. ప్రభుత్వం ఉల్లి విత్తనాల రాయితీని నిలిపివేయడంతో పాటు మండలస్థాయి ఉద్యానవన అధికారుల పోస్టులను కుదించి వేయడంతో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన, సాగులో అవసరమయ్యే సూచనలు రైతులకు అందించేవారు లేరు. ఉద్యాన విస్తరణ అధికారులను ప్రభుత్వం తొలగించడంతో రైతులు ఉల్లి పంటకు బదులుగా వరి తదితర పంటలను వేస్తున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు తరచుగా ఆటుపోట్లకు గురవుతుంటాయి. ధర తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నిల్వచేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
వర్షం దెబ్బతో తగ్గిన పంట విస్తీర్ణం
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఉల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మల్కాపూర్, తూప్రాన్, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట, హవేళీఘణపూర్ తదితర మండలాల్లో రైతులు అధికంగా ఉల్లిని పండించేవారు. ఈ సీజన్లో మెదక్ జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల్లో ఉల్లినారు వేసారు. వర్షాలు విస్తృతంగా కురియడంతో చేనులో నీటి నిల్వతో చాలా వరకు పాడైంది. బహిరంగ మార్కెట్లో మహారాష్ట్ర నాసిక్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పాత ఉల్లిని దిగుమతి చేసుకొని వ్యాపారులు విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ప్రస్తుతం కిలో రూ.50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు.
-నర్సయ్య, ఉద్యాన శాఖ అధికారి, మెదక్ జిల్లా