ఆర్టీసీలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2020-09-21T07:23:46+05:30 IST
ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో సర్వీసుల పార్సిల్, కొరియర్లు బుకింగ్ చేసుకోడానికి బుకింగ్ ఏజెంట్ల నియామకం చేయడానికి దరఖాస్తులను
మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి
తూప్రాన్, సెప్టెంబరు 20: ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో సర్వీసుల పార్సిల్, కొరియర్లు బుకింగ్ చేసుకోడానికి బుకింగ్ ఏజెంట్ల నియామకం చేయడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవి పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్ల నియామకం కోసం ఈనెల 25 వరకు దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు. ఆర్టీసీ చేపట్టిన కార్గో సర్వీసుల మరిన్ని సేవలను విస్తరించేందుకు ఆర్టీసీ నూతనంగా బుకింగ్ ఏజెంట్ల నియామకానికి శ్రీకారం చుట్టినట్లు మాధవి తెలిపారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న కార్గో సర్వీసులు ఆర్టీసీ బస్టాండ్ల వరకు పరిమితం కాగా, ఏజెంట్ల నియామకంతో డోర్ డెలివరీ చేయనున్నట్లు వివరించారు. బుకింగ్ ఏజెంట్లుగా చేరే వ్యక్తులు రిఫండ్ (వాపసు) కింద రూ. 20వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం బుకింగ్ ఏజెంట్ల నియామకం రెండేళ్లకు చేపడుతుండగా, మరో మూడేళ్ల కాలం పొడిగించే అవకాశం ఉంటుందని వివరించారు. బుకింగ్ ఏజెంట్లకు 15శాతం కమిషన్ సంస్థ చెల్లిస్తుందని పేర్కొన్నారు. పార్సిల్, కొరియర్ సర్వీసులను తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఛత్తీ్సఘడ్ రాష్ట్రాలకూ విస్తరించనున్నట్లు మాధవి పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్ల నియామకం కొరకు ఆయా డిపో మేనేజర్లను కలిసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు మేడ్చల్ డిపోమేనేజర్ 9959226152, 7382816225ను సంప్రదించాలని కోరారు.