రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-14T05:02:17+05:30 IST
మండలంలోని నాగ్వార్ గ్రామ శివారులో గల పత్తి జిన్నింగ్ మిల్ వద్ద ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు, డీటీసీఎస్ ప్రణీత రెడ్డి పేర్కొన్నారు.

రాయికోడ్, డిసెంబరు 13: మండలంలోని నాగ్వార్ గ్రామ శివారులో గల పత్తి జిన్నింగ్ మిల్ వద్ద ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీలో రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు, డీటీసీఎస్ ప్రణీత రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, అక్కడ ప్రమాదానికి కారణమైన లారీని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్టు చెప్పారు. లారీపై విచారణ చేపట్టగా అందులో రేషన్ బియ్యం ఉందని డ్రైవర్ చెప్పడంతో స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. దీంతో సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచనామా నిర్వహించి, విచారణ చేపట్టగా జహీరాబాద్ ప్రాంతం నుంచి గుజరాత్కు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ లారీలో సుమారు 250 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు తమ విచారణలో తేలిందని వారు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు, డీటీసీఎస్ ప్రణీతారెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆర్ఐ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.