అనురాగమే బంధముగా..
ABN , First Publish Date - 2020-08-04T11:20:21+05:30 IST
సిద్దిపేట జిల్లాలో సోమవారం రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. కరోనా విస్తృతి నేపథ్యంలో చాలామంది తగుజాగ్రత్తలు తీసుకుని తమ
జిల్లాలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
కొవిడ్ భయంతో దూరప్రాంతాలకు వెళ్లలేని ఆడపడుచులు
ఫోన్లోనే సోదరులకు శుభాకాంక్షలు
కరోనా ప్రభావంతో పడిపోయిన రాఖీల అమ్మకాలు
సిద్దిపేట, ఆగస్టు3: సిద్దిపేట జిల్లాలో సోమవారం రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. కరోనా విస్తృతి నేపథ్యంలో చాలామంది తగుజాగ్రత్తలు తీసుకుని తమ సోదరులకు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టిన వారికి పలువురు శానిటైజర్లు కానుకగా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో రాఖీలు, మిఠాయిల అమ్మకాలు 70 శాతం వరకు పడిపోయాయి. స్వీట్షాపులో కొనడం కంటే ఇంట్లో తయారు చేసిన స్వీట్లకు కొరియర్లో రాఖీలు పంపడానికి కొందరు ప్రాధాన్యతనిచ్చారు. ఆసరాగా చేసుకుని కొరియర్ సంస్థలు విపరీతంగా చార్జీలు పెం చారు. అలా కూడా రాఖీల అమ్మకాలు పడిపోయాయి. మున్సిపల్ కార్మికు లు చైర్మన్కు రాఖీలు కట్టగా ఆయన వారికి శానిటైజర్లు అందజేశారు. రాఖీ పౌర్ణి మ పురస్కరించుకుని హిందువులు అనేక మంది జంధ్యాలు మార్చుకున్నారు.
స్థానిక మార్కండేయ ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం కలశపూజ గాయత్రీ మహాయజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్కడవెర్గు రాజనర్సును పద్మశాలి సమాజం వారు సన్మానించారు. అనంతరం ఆయన కాసేపు మగ్గం చేశారు. సమాజ భవనంలోనే స్వామివారికి పట్టుశాలువా మగ్గంపై నేయడం తదనంతరం పట్టుశాలువాను వేలంపాట వేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాసు, బూర మల్లేశం, పద్మశాలి సంఘం అధ్యక్షులు రమేష్ చేర్యాల మల్లికార్జున్, పెద్ది అశోక్ తదితరులు పాల్గొన్నారు.
జగదేవ్పూర్/మర్కుక్/ములుగు : జగదేవపూర్, మర్కుక్, ములుగు మండలాల వ్యాప్తంగా సోమవారం ఘనంగా రాఖీ పండుగను నిర్వహించుకున్నారు. అన్నదమ్మళ్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
వర్గల్/మద్దూరు/అక్కన్నపేట/బెజ్జంకి/హుస్నాబాద్రూరల్/చేర్యాల/ నంగునూరు/తొగుట/నంగునూరు : వర్గల్, మద్ద్దూరు, హుస్నాబాద్, హుస్నాబాద్ మండలంలో అక్కన్నపేట, బెజ్జంకి, చేర్యాల, కొమురవెల్లి, తొగుట, నంగునూరు మండలాల్లోని గ్రామాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. బెజ్జంకి మండల ప్రజలకు ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత, ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావంతో చాలామంది ఆడపడుచులు దూరప్రాంతాలకు వెళ్లలేక ఫోన్ల ద్వారానే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
మంత్రి హరీశ్రావుకు రాఖీ కట్టిన మహిళా నాయకులు
గజ్వేల్ : గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి, మున్సిపల్ మాజీ వైస్చైర్పర్సన్ దుంబాల అరుణ మంత్రి హరీశ్ రావుకు హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
కొండపాక : రక్షాబంధన్ సందర్భంగా మంత్రి హరీశ్రావుకు, కొత్త ప్రభాకర్రెడ్డికి, మున్నూరు కాపు సంఘం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోలా సద్గుణ సోమవారం రా ఖీ కట్టారు. ఆమె పుట్టినరోజు సందర్భంగావారి ఆశీర్వాదం పొందారు.
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కొండాపూర్లోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్షాబంధన్తో పాటు స్వీయ రక్షణ పాటించాలని సూచించారు.
అనాదిగా పూల రాఖీ.. ఆ కుటుంబం ప్రత్యేకత
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లికి చెందిన దొంతరబోయిన అయిలయ్య కూరగాయలు, పూలు పండిస్తాడు. అందుకే ఈయనను కూరగాయల అయిలయ్య అని పిలుస్తారు. అయితే రాఖీ పండుగ వచ్చిందంటే అందరూ వివిధ రకాల రాఖీలను కట్టుకోవడం చూస్తాం. కానీ అయిలయ్య కుటుంబం మాత్రం ప్రతి రాఖీ పండుగకు పూల రాఖీలను కట్టుకోవడం అనాదిగా వస్తున్నది. ప్రతిసారీ పంచపాండవుల పూలను రాఖీలుగా కట్టుకునేవారు. ఈసారి అవి పూయకపోవడంతో సోమవారం రాఖీ పండుగ సందర్భంగా గులాబీ, మందార పూల రాఖీలను అయిలయ్య, లక్ష్మీ దంపతులకు వారి కూతుళ్లు, సోదరీమణులు కట్టి ఆనవాయితీగా కొనసాగించారు.
వీరజవాన్ విగ్రహానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెలు
అక్కన్నపేట: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ పండుగ రోజు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అయితే తన సోదరుడు చనిపోయినా అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటిచెబుతున్నారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ నరసింహనాయక్ సోదరీమణులు. అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అతడు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతిచెందాడు. అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్, సత్తవ్వ నరసింహనాయక్ విగ్ర హం ఏర్పాటు చేశారు. విగ్రహంలోనే తమ సోదరుడిని చూసుకుంటున్నారు. ఏటా విగ్రహానికి రాఖీ కట్టి పండుగ జరుపుకుంటున్నారు.