గప్చుప్గా ‘రేషన్’కు అనుమతులు?
ABN , First Publish Date - 2020-11-21T06:01:45+05:30 IST
సదాశివపేట పట్టణంలో గప్చుప్గా ఒక రేషన్ దుకాణానికి అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉండగా సంబంధిత శాఖల అధికారులు వాటిని బేఖాతర్ చేస్తూ ఒక్కరికి మాత్రమే రేషన్ దుకాణం మంజూరు చేసినట్టు సమాచారం.

దరఖాస్తులు ఆహ్వానించకుండా డీలర్షిప్ మంజూరు
నిబంధనలు బేఖాతరు చేసిన సివిల్ సప్లయ్ అధికారులు
సదాశివపేట, నవంబరు 20: సదాశివపేట పట్టణంలో గప్చుప్గా ఒక రేషన్ దుకాణానికి అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. నిబంధనల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉండగా సంబంధిత శాఖల అధికారులు వాటిని బేఖాతర్ చేస్తూ ఒక్కరికి మాత్రమే రేషన్ దుకాణం మంజూరు చేసినట్టు సమాచారం. పట్టణంలో కొంత కాలం క్రితం ఓ రేషన్ డీలర్ మృతి చెందగా, మరొక డీలర్ తన డీలర్షి్పకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈ రెండు రేషన్ షాపుల నిర్వహణను కొంత కాలంగా అధికారులు ఇతర రేషన్ డీలర్లకు అప్పగించారు. నిబంధనల మేరకు ఖాళీగా ఉన్న రేషన్ షాపుల డీలర్షి్పను నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కేటాయింపులు జరపాలి. నిబంధనల ప్రకారం రెండు రేషన్ షాపులకు ఒకేసారి డీలర్లను కేటాయించాలి. కానీ ఇటీవల ఒక షాప్కు అధికారులు అనుమతులు మంజూరు చేసినట్టు తెలుస్తున్నది. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే ఖాళీగా ఉన్న రెండు షాపుల్లో ఒక్క షాప్కు మాత్రమే డీలర్ను నియమించడంపై పట్టణంలోని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాప్ల కేటాయింపులో జీవో నం.(20)ని అధికారులు పట్టించుకోనట్టు సమాచారం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకొని రేషన్ సాపుల కేటాయింపులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే?
రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని తహసీల్దార్ ఆశాజ్యోతి తెలిపారు. ఖాళీగా ఉన్న రేషన్ షాపుల వివరాలను నివేదిక రూపంలో ఆర్డీవోకు అందజేస్తామని చెప్పారు. తుది నిర్ణయం ఆర్డీవో, సివిల్ సప్లై ఉన్నతాధికారులు తీసుకుంటారని వివరించారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే రేషన్ షాప్నకు డీలర్ కేటాయింపు జరిగి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.