రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి

ABN , First Publish Date - 2020-11-27T05:53:58+05:30 IST

రాజ్యాంగానికి కట్టుబడే ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు.

రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి
మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి 


సంగారెడ్డి క్రైం, నవంబరు 26 : రాజ్యాంగానికి కట్టుబడే ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం సమాజానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలని, ఎవరైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద, ధనిక తేడా లేకుండా రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కలిపించిందని తెలిపారు. రాజ్యాంగం చాలా పెద్దదని, ప్రజల హక్కులకు, ప్రాథమిక విధులకు ఆటంకం కలిగించరాదని, న్యాయం అందరికీ సమానమని తెలిపారు. ప్రతి పనికీ న్యాయం, చట్టం అనే దాంతో ముడిపడి వుంటుందని చెప్పారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లతో రాజ్యాంగ ఉపోద్ఘాతం చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కర్ణకుమార్‌, జిల్లా రెండో అదనపు జడ్జి జె.మైత్రేయి, సీనియర్‌ సివిల్‌ జడ్జి బీ పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి ఎం.కల్పన, స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి ఏ.నిర్మల, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:53:58+05:30 IST