పులి సంచారంతో గ్రామస్థుల భయాందోళన
ABN , First Publish Date - 2020-12-31T05:15:06+05:30 IST
వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లిన రైతుకు పులి కనిపించిన సంఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకున్నది.
మిరుదొడ్డి, డిసెంబరు 30 : వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లిన రైతుకు పులి కనిపించిన సంఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన రమేష్ తెల్లవారుజామున వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. కంది చేనులో పులి కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించాడు. సుమారు 50 మంది గ్రామస్థులు కర్రలు పట్టుకుని పులి కోసం గాలించినా కనిపించలేదు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి రాకముందే గ్రామంలో పులి సంచారం లేదని, హైనా అంటూ ఫోన్లో తేల్చేశారు. దీంతో అటవీశాఖ అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తేరుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించారు.