నేడు చేర్యాల బంద్కు ప్రతిపక్షాల పిలుపు
ABN , First Publish Date - 2020-12-11T05:35:17+05:30 IST
చేర్యాల పెద్దచెరువు మత్తడి ప్రాంగణంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని స్థానిక ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
చేర్యాల, డిసెంబరు 10: చేర్యాల పెద్దచెరువు మత్తడి ప్రాంగణంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని స్థానిక ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టనున్న చేర్యాల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ర్యాలీ నిర్వహించి, వ్యాపార, వాణిజ్య దుకాణాదారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రతా్పరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడారు. ర్యాలీలో కౌన్సిలర్ లింగం, నాయకులు కొమ్ము నర్సింగరావు, మల్లిగారి యాదయ్య, అందె బీరయ్య, అందె అశోక్, ఈరు భూమయ్య, కొంగరి వెంకట్మావో, భాస్కర్రెడ్డి, ముస్త్యాల యాదగిరి, మంచాల చిరంజీవులు, పోలోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
బంద్కు సహకరించవద్దు: మునిసిపల్ చైర్పర్సన్ స్వరూపారాణి
చేర్యాల పట్టణానికి వరద ముప్పు వాటిల్లకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాటుపడుతుంటే ప్రతిపక్షాలు బంద్కు పిలుపునివ్వడం తగదని, మునిసిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి అన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్కు సహకరించొద్దని కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 1,000 గజాల స్థలాన్ని వారి పట్టేదారుల నుంచి తీసుకుని అధికారులకు అప్పగించారని చెప్పారు. కాలువ నిర్మాణానికి మునిసిపల్ కార్యాలయంలో చేసిన తీర్మానంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సంతకాలు కూడా చేశారన్నారు. రాజకీయ ఉనికి కోసం పట్టణాభివృద్ధి అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు.