రైతులకు నివర్‌ దడ

ABN , First Publish Date - 2020-11-26T06:10:04+05:30 IST

రైతుల్లో నివర్‌ తుఫాన్‌ వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో నివర్‌ తుఫాన్‌ తెలంగాణను తాకే అవకాశముందని వాతావరణశాఖ తెలపడంతో ఆందోళన చెందుతున్నారు.

రైతులకు నివర్‌ దడ
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డుపై ధాన్యం కుప్పలు, పైన మేఘావృతమైన ఆకాశం

 గ్రామాల్లో ఎక్కడికక్కడ కుప్పలుగా ధాన్యం 

 వర్షం కురిస్తే మళ్లీ తప్పని నష్టం

 ఇప్పటికే వరుస వర్షాలతో దెబ్బతిన్న రైతు

 పత్తి రైతుల్లోనూ వాన భయం


గజ్వేల్‌, నవంబరు 25: రైతుల్లో నివర్‌ తుఫాన్‌ వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో నివర్‌ తుఫాన్‌ తెలంగాణను తాకే అవకాశముందని వాతావరణశాఖ తెలపడంతో ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కుప్పలు రోడ్లపై, కల్లాల్లో ఉన్నాయి. పత్తి పొలాల్లో తీసేందుకు సిద్ధంగా ఉండడంతో తుఫాన్‌ ఏర్పడితే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. రైతులు వరికోతలు పూర్తి చేసి, కొన్ని రోజులుగా పంటలను రోడ్లపై, కల్లాల్లో పోసి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. నివర్‌ తుఫాన్‌ వార్తల నేపథ్యంలో ధాన్యం కుప్పలను రక్షించుకునేందుకు టార్ఫాలిన్‌ కవర్లు కప్పి, ఆకాశం వైపు చూస్తూ కుప్పల వద్దే జాగారం చేస్తున్నారు. వర్షం వస్తే పొలాల్లోని ధాన్యం మొలకెత్తే అవకాశమున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ధాన్యానికే కుంటిసాకులు చెప్పే వ్యాపారులు వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొంటారో లేదోనన్న ప్రశ్న రైతుల మెదళ్లలో నానుతోంది. గతేడాది కొనుగోలు కేంద్రాల్లో ఉండగానే వర్షం కురిసి వందల క్వింటాళ్ల ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 


కూలీలు దొరక్క చేలల్లోనే ఉండిపోయిన పత్తి


లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పత్తి చేలల్లోనే ఉండిపోయింది. ఈ యేడు పత్తి విత్తనాలు విత్తినప్పటి నుంచి రైతులను వరుణుడు ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాడు. మొదటి విడత పత్తి ఇప్పటికే ఏరాల్సి ఉన్నా కూలీలు దొరక్క ఇంకా చేలల్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఆకాశం మేఘావృతం అవుతుండడంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు కురిస్తే పత్తి గింజ పూర్తిగా నాని పనికి రాకుండా పోతుందన్న బాధలో ఉన్నారు. ఇప్పటికే తేమ పేరుతో రైతులకు సీసీఐ, ప్రైవేటు వ్యాపారులు కొర్రీలు పెడుతూ ధరలో కోత విధిస్తున్నారు. వర్షం వస్తే కనీసం పెట్టుబడులు రాక అప్పుల పాలవుతామని కుమిలిపోతున్నారు. వర్షం కురిస్తే ధాన్యంతో పాటు పత్తికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలుండడంతో ఏమీ చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు.


కొనుగోలు కేంద్రాల్లోనే సన్న వడ్లు


ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగుచేయాలని వానాకాలంలో ఆదేశాలు ఇవ్వడంతో రైతులు భారీ ఎత్తున సన్నరకం వడ్లను సాగుచేశారు. కానీ దొడ్డురకం వడ్లకు మాత్రమే మద్దతు ధరను ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. సన్నరకం ధాన్యంపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోకి వడ్లను తెచ్చి, మద్దతు ధర కోసం నిరీక్షిస్తున్నారు. నివర్‌ తుఫాన్‌ ఏర్పడితే కొనుగోలు కేంద్రాల్లోని ఉన్న వడ్లు తడిసి నష్టపోయే అవకాశముంది. ఇప్పటికైనా ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-26T06:10:04+05:30 IST