తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలి

ABN , First Publish Date - 2020-12-21T05:17:55+05:30 IST

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 20 : యాసంగిలో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం వెదజల్లే పద్ధతితో వరి విత్తనం వేసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలి
రైతు లక్ష్మీతిరుపతిరెడ్డిని సన్మానిస్తున్న మంత్రి హరీశ్‌రావు

వరి నాటు వేయకుండా వెదజల్లే పద్ధతిని రైతులు అవలంభించాలి

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట అగ్రికల్చర్‌, డిసెంబరు 20 : యాసంగిలో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం వెదజల్లే పద్ధతితో వరి విత్తనం వేసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఆదివారం వరి విత్తనం వెదజల్లే పద్ధతిపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో జిల్లాలో 2.50  లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ నాట్లు వేసుకునే పద్ధతిలో కంటే విత్తనం వెదజల్లే విధానంలో వరి దిగుబడి ఎక్కువగా వస్తుందని, ఖర్చు తగ్గుతుందని వివరించారు. ఎకరా పొలంలో నాటు వేయడానికి కూలీల ఖర్చు రూ.5 వేలు అవుతుందని, వెదజల్లే పద్ధతిలో ఈ ఖర్చును రైతులు ఆదా చేసుకోవచ్చని చెప్పారు. సాధారణ వరితో పోలిస్తే 10 రోజులు ముందుగానే కోతకు వస్తుందన్నారు. నాట్లు వేసే పద్ధతితో పోల్చితే నాలుగు క్వింటాళ్లు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. కూలీల కొరత వేధిస్తున్న తరుణంలో వెదజల్లే పద్ధతి రైతులకు లాభసాటిగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతీ రైతు ఈ ఏడాది ప్రయోగాత్మకంగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని కోరారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే వరి వెదజల్లే పద్ధతిని అవలంభించి లాభాలు పొందుతున్న రైతు లక్ష్మీతిరుపతిరెడ్డిని సభకు పరిచయం చేసి, ఆమె అనుసరిస్తున్న విధానాన్ని మంత్రి రైతులకు వివరించారు. రైతులు, వ్యవసాయ అధికారులు ఆమె సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, రైతుబంధు సమితి జిల్లా అఽధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చు

నేను మొదట వెదజల్లే సాగు చేసినప్పుడు చాలామంది ఎగతాలి చేశారు. అయినా వెనకడుగు వేయకుండా నా భర్త సహకారంతో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో విజయం సాధించాను. 13 ఎకరాల్లో వరి నాటు వేయకుండా వెదజల్లే పద్ధతినే అవలంభిస్తున్నాను. దీనికి కూలీల అవసరం ఉండదు. ఇందుకోసం ముందుగా వరి విత్తనాన్ని 48 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రధాన పొలాన్ని మంచిగా దున్నుకొని, పొలమంతా సమాంతరంగా ఉండేటట్లు గొర్రును కొట్టుకోవాలి. నానిన వరి విత్తనాలు పొలం అంతటా సమానంగా పడేటట్లు వెదజల్లుకోవాలి. ఎకరాకు కేవలం 15 కేజీల విత్తనం సరిపోతుంది. ఈ సాగుతో ఎకరాకు 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది.

- లక్ష్మీతిరుపతిరెడ్డి, రైతు 


Updated Date - 2020-12-21T05:17:55+05:30 IST