పల్లెల రూపురేఖలు మార్చడమే సీఎం ధ్యేయం
ABN , First Publish Date - 2020-03-16T07:44:05+05:30 IST
తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మార్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
రూ.1 కోటి 65 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ
సదాశివపేట రూరల్, మార్చి 15 : తెలంగాణలోని పల్లెల రూపురేఖలు మార్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మండలంలోని ఇశ్రితాబాద్, వెంకటాపూర్, మాచిరెడ్డిపల్లి, మద్దికుంట గ్రామాలల్లో రూ.1 కోటి 65 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాలు, డంప్యార్డులు, సీసీ కెమెరాలు, మహిళా, గ్రామపంచాయితీ, బీసీ కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన, కలెక్టర్ హన్మంతరావు, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా పల్లెప్రగతిని ప్రారంభించారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపుయార్డులు, పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్లు, హరితహారం, చెడిపోయిన విద్యుత్ స్తంభాలను, రోడ్లను బాగుచేసుకోవడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వాలు గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలని ఎంపీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు తొంట యాదమ్మ, ఎంపీటీసీ సుధాకర్, ఆయా గ్రామాల సర్పంచులు రాములు, బాలమణి, సమీనా అంజుమ్, అమృత ఏసు, నబీన్ , నాయకులు గడీల సుధీర్రెడ్డి, ఆత్మాకూర్ నాగేష్, సలావుద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చిన్నా, యువత అధ్యక్షుడు పిల్లిగుండ్ల వీరేశం పాల్గొన్నారు.