ఆరేళ్లలో నూరేళ్ల అభివృద్ధి
ABN , First Publish Date - 2020-10-03T10:09:45+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లలో నూరేళ్ల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
టీఆర్ఎస్ ప్రతీ అడుగు రైతు కోసమే : మంత్రి హరీశ్రావు
వివిధ మండలాల నుంచి టీఆర్ఎస్లో పలువురి చేరిక
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 2: తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లలో నూరేళ్ల అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి, తొగుట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సిద్దిపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. ఒకప్పుడు గ్రామాల పరిస్థితిని, ఇప్పుడు గ్రామాల్లో మారిన పరిస్థితులను గమనించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలు, పట్టణాల దశ మారిందని ఆయన గుర్తుచేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మిషన్ కాకతీయ, రెండో ఏడాదిలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడో సంవత్సరం రైతుబంధు, నాలుగో ఏటా రైతుబీమా, ఐదో సంవత్సరంలో కాళేశ్వరం జలాలు, ప్రస్తుతం కొత్తరెవెన్యూ చట్టం తెచ్చామని వెల్లడించారు.
ప్రతీ అడుగూ రైతుకోసమే వేస్తున్నామన్నారు. బీజేపీ తెచ్చిన వ్యవసాయ బిల్లు చాలా ప్రమాదకరమైనదని ఆయన ఆరోపించారు. రెండెకరాలు ఉన్న రైతు ఢిల్లీకి పోయి ధాన్యం విక్రయిస్తాడా? అని ప్రశ్నించారు. రైతుల బతుకులను కార్పొరేట్ పెద్దల చేతుల్లో పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎ్సలో చేరిన వారిలో మాజీ జడ్పీటీసీ నర్మల చంద్రం, మాజీ సర్పంచ్ డి.కోమల, రిటైర్డ్ ఎస్ఐ లక్ష్మణ్, చెప్యాల ఉప సర్పంచ్ బాల్రెడ్డి, గౌడసంఘం అధ్యక్షుడు రాజగౌడ్తోపాటు బీజేపీ, కాంగ్రె్సకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ప్రజా ఉద్యమాల్లో విజయం సాధించిన రామలింగారెడ్డి
సిద్దిపేట అర్బన్ : వామపక్ష భావజాలంతో ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ప్రజాప్రతినిధిగా సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో రామలింగారెడ్డి యాదిలో ‘స్వప్న సాధకుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రామలింగారెడ్డి ఒకే జీవితంలో మూడు అవతారాలు సక్సెస్ ఫుల్గా చూశారని మంత్రి తెలిపారు. రామలింగారెడ్డి స్టేజీ వివాహం చేసుకోవడమే కాకుండా వారి పిల్లలకు సైతం స్టేజీ వివాహాలు జరిపించారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నా కూడా సమస్యలుంటే ప్రతిపక్ష పాత్ర పోషించే వారు ఉన్నారని చెప్పారు. దుబ్బాకకు రామలింగారెడ్డి తాగు, సాగు నీరందించే చివరిదశలో ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. మరికొద్ది రోజుల్లో ఇంటింటికీ తాగునీరు, ప్రతీ ఎకరాకు సాగునీరంచాలనే లింగన్న స్వప్నాన్ని త్వరలోనే నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నందిని సిధారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, మరసం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్కు లీడర్ లేడు..బీజేపీకి క్యాడర్ లేదు
తొగుట : ‘‘కాంగ్రెస్కు లీడర్ లేడు..బీజేపీకి క్యాడర్ లేదు.. టీఆర్ఎస్ ఉండగా వారెందుకు దండగా’’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామ పీఏసీఎస్ డైరెక్టర్ మైపాల్రెడ్డి, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడితో పాటు 50 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. ‘‘మీకు అండగా.. నేనున్నా.. ఎప్పుడైనా నా ఇంటి తలుపు తట్టొచ్చు’’ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవిరవీందర్ పాల్గొన్నారు.