నేటికీ లక్షల ఎకరాలు భూస్వాముల చేతుల్లోనే

ABN , First Publish Date - 2020-09-16T07:07:35+05:30 IST

నేటికీ మారుమూల గ్రామాల్లో భూస్వాముల చేతుల్లో లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని పేదలకు పంపిణీ చేసే వరకు

నేటికీ లక్షల ఎకరాలు భూస్వాముల చేతుల్లోనే

రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థ లేదనడం హాస్యాస్పదం

ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు బీజేపీ కుట్ర

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


హుస్నాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 15: నేటికీ మారుమూల గ్రామాల్లో భూస్వాముల చేతుల్లో లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని పేదలకు పంపిణీ చేసే వరకు సీపీఎం ఉద్యమాలు చేపడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణా సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాలు వేసి బైక్‌లపై ర్యాలీగా మహ్మదాపూర్‌ గుట్టల్లోని అమరుల ఘాట్‌ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన 12 మంది వీరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ  తెలంగాణాలో భూస్వామ్య వ్యవస్థ లేదని, పంచడానికి భూములు లేవని సీఎం కేసీఆర్‌ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులను అంతం చేయాలనే లక్ష్యంతో  ఆర్‌ఎ్‌సఎస్‌ ముసుగులో బీజేపీ కుట్ర పన్నిందన్నారు.


అందువల్లే కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు.బీజేపీ అణచివేత ధోరణికి పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధపోరాట వీరుడు అనభేరి ప్రభాకర్‌రావులాంటి వీరుల త్యాగాలను కొనసాగించేందుకు యువతరం కదలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేసిన రోజును ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రమ, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, గీట్ల ముకుందర్‌రెడ్డి, జిల్లా, మండల నాయకులు భీమాసాహెబ్‌, శివరాజ్‌, రాజునాయక్‌, శశిధర్‌, రేవంత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-16T07:07:35+05:30 IST