రబీలో ధాన్యం కొనుగోలు లక్ష్యం
ABN , First Publish Date - 2020-03-13T10:34:54+05:30 IST
రబీలో ధాన్యం కొనుగోలు లక్ష్యం

2.20 లక్షల మెట్రిక్ టన్నులు
గణనీయంగా పెరిగిన వరి సాగు
సిద్దిపేట అగ్రికల్చర్, మార్చి 12: యాసంగి సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చి న పంటల వివరాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. అందుకు తగినట్లుగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు
ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో రైతులు వరి సాగు చేశారు. అధికారులు ముందస్తుగానే కొనుగోలుపై దృష్టిసారించారు. వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సాగు చేసిన పంటల వివరాలు సేకరించారు. సుమారు లక్ష ఎకరాల్లో వరి పంటను సాగవుతుందని అధికారులు అంచనా వేయగా 1.21 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు కంటే ప్రత్యామ్నాయ పంటలపైన అధికారులు అవగాహన కల్పించినా రైతులు వరి వైపే మొగ్గు చూశారు.
ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 186 సెంటర్ల ద్వారా 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ఖరీ్ఫ్లో 181 సెంటర్ల ద్వారా 1.57 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సారి దిగుబడి మరింత పెరిగే అవ కాశం ఉన్నందున పీఏసీఎస్ 61, ఐకేపీ 125 ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.55 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్ర స్థలాలను కూడా పరిశీలన చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని సరిచేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు.
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు - హరీశ్, సివిల్ సప్లయ్ మేనేజర్
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో వరి సాగు పెరిగిన దృష్ట్యా అందుకు అనుగుణంగానే కొనుగోళ్లు జరిపేందుకు కసరత్తు చేస్తున్నాం. 186 సెంటర్ల ద్వారా కొనుగోలు చేయనున్నాం. ఇందుకు సంబంధించిన గన్నీ సంచులు కూడా ముందుగానే అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాం.