యాగాలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2020-05-29T10:23:00+05:30 IST
కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన యాగాలకు సర్వం

జగదేవ్పూర్, మే 28: కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన యాగాలకు సర్వం సిద్ధమైంది. జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద నవ చండీయాగం, మర్కుక్ సమీపంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్హౌస్ వద్ద సుదర్శనయాగాన్ని నిర్వహించనున్నారు. శృంగేరీ పండితుడు గోపీకృష్ణశర్మ ఆధ్వర్యంలో చండీహోమం నిర్వహించనుండగా కొండపోచమ్మ ఆలయ చైర్మన్ ఉపేందర్రెడ్డి దంపతులు, తీగుల్నర్సాపూర్ సర్పంచ్ రజితరమేశ్ దంపతులు యాగంలో కూర్చోనున్నారు.
సుదర్శనయాగంలో మర్కుక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ దంపతులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మర్కుక్ కరుణాకర్రెడ్డి దంపతులు కూర్చోనున్నారు. యాగ నిర్వహణ కోసం ఒక్కొక్క యాగశాలకు 15 మంది చొప్పున 30 మంది రుత్వికులు యాగశాలలకు చేరుకున్నారు. యాగశాలల ప్రాంతాల్లో వారికి బస ఏర్పాటు చేశారు. తెల ్లవారుజామున 4:15 నిమిషాలకు చండీయాగం ప్రారంభం కాగా, 7 గంటలకు సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అక్కడి నుంచి మర్కుక్లోని పంప్హౌస్ వద్ద జరిపే సుదర్శనయాగంలో పాల్గొంటారు.
సుభిక్షంగా ఉండాలనే చండీయాగం: గోపీకృష్ణశర్మ, పండితుడు
ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ బృహత్కార్యం చేపట్టినా చండీమాత అనుగ్రహం పొందడానికి హోమం నిర్వహిస్తారు. పది సార్లు చండీమాత పారాయణం చేసిన అనంతరం పూర్ణాహుతితో చండీయాగం ముగుస్తుంది.