భక్తులు లేకుండానే కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-23T06:45:00+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వారం జాతర ఆదివారం ముగిసింది. ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి...

భక్తులు లేకుండానే కొమురవెల్లిలో బ్రహ్మోత్సవాలు

  • మల్లన్న చివరివారం జాతర కరోనార్పరణం


చేర్యాల, మార్చి 22: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి వారం జాతర ఆదివారం ముగిసింది. ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా భక్తులను నియంత్రించడంతో జాతర వారు లేకుండానే ముగిసింది. వీరశైవాగమశాస్త్రం ప్రకారం ఏటా మార్గశిరమాసం చివరి ఆదివారం రోజున స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రోజున అర్ధరాత్రి జరిగే అగ్నిగుండాలతో ముగుస్తాయి. తిథి, వార, నక్షత్రాల ఆధారంగా ఒక్కో ఏడాది మూడు నెలల కాలంలో ఏడువారాల నుంచి 12వారాల వరకు ప్రతి ఆదివారం జాతర కొనసాగుతుంది. ఈ ఏడాది 10వారాలు రాగా, 9వారాల పాటు జాతర అంగరంగ వైభవంగా సాగింది. ప్రతి వారం అఽధికంగా భక్తులు తరలిరావడంతో ఈ ఏడాది బుకింగ్‌ ఆదాయంతో పాటు హుండీ ఆదాయం పెరిగింది. కానీ కరోనా కారణంగా అర్జితసేవలు, దర్శనాలు నిలిపివేయడంతో పాటు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ కారణంగా భక్తులెవరూ రాలేదు. దీంతో 10వారం జాతర నిర్మానుష్యంగా ముగిసింది.


సంప్రదాయబద్ధంగా వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ

జాతర ముగింపు సందర్భంగా సంప్రదాయబద్ధంగా అర్చకులు తోటబావి ప్రాంగణంలో వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి ఊరేగింపుగా దేవతామూర్తుల విగ్రహాలను పల్లకీలో తోటబావి ప్రాంగణానికి తీసుకువచ్చారు. వీరశైవాగమశాస్త్రం ప్రకారం వీరశైవపండితులు పూజలు జరిపారు. వీరశైవ పండితుల మంత్రోచ్ఛారణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. పూజానంతరం అర్ధరాత్రి అగ్నిగుండాల నిర్వహణకు ప్రజ్వలన చేపట్టారు. నేటి తెల్లవారుజామున స్వామివారి మేలుకొలుపు అనంతరం వీరశైవ గురువుకు పాదార్చన జరిపి అష్టదిక్కులా బలిహరణ జరిపిన అగ్నిగుండాలు దాటనున్నారు. 

Updated Date - 2020-03-23T06:45:00+05:30 IST