రైతన్నల రాస్తారోకో..
ABN , First Publish Date - 2020-05-11T09:47:58+05:30 IST
గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం రవాణా చేయకపోవగా తూకం వేయడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం ..
![రైతన్నల రాస్తారోకో..](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051103113/05112020041704n88.jpg)
ధాన్యం కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై ఖానాపూర్.బి రైతుల ఆందోళన
కల్హేర్, మే10 : గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం రవాణా చేయకపోవగా తూకం వేయడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్.బి గ్రామానికి చెందిన రైతులు ఆదివారం 161వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి -అకోలా రహదారి గంట పాటు స్తంభించింది. ఖానాపూర్.బిలో యాసంగిలో అత్యధికంగా ధాన్యం పండించడంతో గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మొదట్లో ఈ కేంద్రం నుంచి అయిదు లారీల ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు తరలించారు. మిగతా ధాన్యాన్ని తరలించడానికి లారీలు రాకపోవడంతో నిలువ చేయడానికి గోడౌన్ లేక కొనుగోళ్లు నిలిపివేశారు. శుక్రవా రం సాయంత్రం ఆదివారం ఉదయం భారీ వర్షం కురవడంతో ధాన్యం తడి సి మొలకలు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. కల్హేర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి సోమవారం వరకు లారీలను పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.