ఆలయాలకు కార్తీక శోభ
ABN , First Publish Date - 2020-12-01T06:07:36+05:30 IST
జిల్లాలోని ఆలయాలు కార్తీక దీపాల వెలుగులో కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలివెళ్లారు.
కన్నుల పండువగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు
మెదక్ అర్బన్, నవంబరు 30: జిల్లాలోని ఆలయాలు కార్తీక దీపాల వెలుగులో కొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంతో పాటు ఏడుపాయాల వనదుర్గామాత ఆలయం, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట, అల్లాదుర్గం తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆదిదేవుడి దర్శనం కోసం బారులు తీరారు. సాయంత్రం ఆలయాల్లో కార్తీక దీపాలు వెలుగించి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ పట్టణంలోని కోదండ రామాలయం, అయ్యప్ప ఆలయంతోపాటు బ్రాహ్మణవీధి శివాలయం, కుమ్మరిగడ్డ ఆలయం, పేరూర్ సరస్వతీ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో లక్ష దీపోత్సవం
పాపన్నపేట: పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి లక్షదీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వనదుర్గామాతను దర్శించుకున్న అనంతరం జ్యోతిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పల్లకీసేవ, మంజీరా నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా పల్లకీని మోసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయల మార్గాన్ని త్వరలోనే సీసీ రోడ్డుగా మారుస్తామని, యజ్ఞశాలను ప్రారంభిస్తామని, వరదలకు ధ్వంసమైన ఆలయాన్ని శివరాత్రి వరకు మరమ్మతు చేపడుతామని పేర్కొన్నారు. ఎంపీపీ చందనారెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి, ఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.