కోర్టు ఆదేశాలున్నా ఆగని అక్రమ నిర్మాణాలు
ABN , First Publish Date - 2020-12-18T05:12:39+05:30 IST
హైకోర్టు, జిల్లా కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతున్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ కోర్టు ఆదేశాలున్నాయి.

రామచంద్రాపురం, డిసెంబరు 17: హైకోర్టు, జిల్లా కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతున్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ కోర్టు ఆదేశాలున్నాయి. కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. విషయాన్ని బాధితులు గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకట మణికరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ చేపట్టాలని టీపీవో రాజే్షను కమిషనర్ ఆదేశించారు. కొల్లూరు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్వాలాకుమార్, ప్రధాన కార్యదర్శి కోనం బ్రహ్మయ్య తెలిపిన వివవరాల ప్రకారం... 1984లో వాల నారాయణరావు కొల్లూరు సర్వే నంబరు 192లోని 125 ఎకరాల్లో చేసిన భవానీనగర్ లేఅవుట్లో తమ అసోసియేషన్కు చెందిన సుమారు 150 మంది ప్లాట్లు ఉన్నాయన్నారు. వందల కోట్ల రూపాయల విలువచేసే ఈ ప్లాట్లను కొందరు వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే మంజూరు చేసిందని చెప్పారు. స్టే ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తమ ప్లాట్లను ఆక్రమించుకుంటూ నిర్మాణాలు చేస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని కమిషనర్కు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు.
కోర్టు ఆదేశాలున్నాయని పత్రాలు చూపారు
అసోసియేషన్ సభ్యులు కోర్టు ఆదేశాలకు సంబంధించిన పత్రాలను గురువారం చూపారని కమిషనర్ వెంకటమణికరణ్ పేర్కొన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే కూలుస్తామని కమిషనర్ చెప్పారు.
