దసరా తర్వాతే ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-10-25T06:36:28+05:30 IST
మెదక్ జిల్లాలో దసరా తర్వాతి మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి
మెదక్ రూరల్, అక్టోబరు 24: మెదక్ జిల్లాలో దసరా తర్వాతి మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 40 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నదని చెప్పారు. మంగళ, బుధ, గురువారాల్లో ఆ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పారు.
నవంబరు 15 లోగా వేదికల నిర్మాణాలు పూర్తవ్వాలి
జిల్లాలో రైతువేదికల నిర్మాణాలను నవంబరు 15 లోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికి కాంట్రాక్టులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.