దసరాలోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తవ్వాలి
ABN , First Publish Date - 2020-10-01T09:52:23+05:30 IST
రైతుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణాలను దసరాలోపే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. జిల్లాలో
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
సిద్దిపేట అగ్రికల్చర్, సెప్టెంబరు 30: రైతుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణాలను దసరాలోపే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాల పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సందీ్పకుమార్ సుల్తానియా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతువేదికల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పనులు వేగంగా చేపట్టేందుకు షిఫ్ట్ల సంఖ్య పెంచాలని, ఇందుకు సరిపడా కార్మికులను సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు సమకూర్చుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని రైతువేదికల వద్ద తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం తగదని, నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పద్మాకర్, ముజామిల్ ఖాన్, జడ్పీ సీఈవో శ్రవణ్కుమార్, జిల్లావ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేష్బాబు, వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ధరణి ప్రయోజనాలను ప్రజలకు వివరించండి
ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలను నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన.. కలెక్టర్ వెంకట్రామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ఖాన్తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామాల్లోని పాఠశాలలు, ఆలయాలు, ఇతర భూముల వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలని చెప్పారు. ఆస్తికి సంబంధించిన యజమాని వివరాలు, ఫోటోను యాప్లో అప్ లోడ్ చేయాలని సూచించారు.
తోర్నాలలో పర్యటన
సిద్దిపేటరూరల్ : గ్రామపంచాయతీలో జరిగే ఆస్తుల నమోదు ప్రకియను పూర్తిస్థాయిలో అమలు చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో అధికారులు చేస్తున్న ఆస్తుల నమోదు ప్రక్రియను సందీప్ సుల్తానియా, కలెక్టర్తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ అధికారులు చేస్తున్న ఆస్తుల అసెస్మెంట్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఓ ఇంటి యజమానితో ముచ్చటించారు. ప్రభుత్వం రైతుల పాసుబుక్కు అందించిన విధంగానే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పుస్తకాన్ని అందిస్తుందన్నారు. దీని ద్వారా ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. ఆయన వెంట డీపీవో సురేశ్ బాబు, డీఆర్డీవో గోపాల్రావు, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఎంపీవో అరవింద్, ఎంపీపీ శ్రీదేవి చందర్రావ్, వైస్ ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ దేవయ్య, సెక్రటరీ మమత పాల్గొన్నారు.