పల్లె ప్రగతికి డిజిటల్ దన్ను
ABN , First Publish Date - 2020-12-21T05:09:00+05:30 IST
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించగా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల వంటి పనులు నిర్వహిస్తున్నారు.

రోజువారీ పనులు యాప్లో నమోదు
అప్డేట్ చేయాల్సిన బాధ్యత కార్యదర్శులదే
పురోగతిపై అధికారుల తనిఖీ సులభతరం
మెదక్ రూరల్, డిసెంబరు 20: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించగా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల వంటి పనులు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రమైన రోడ్లు, హరితహారం తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచడంతో పాటు పాదర్శకత, సమస్యల గుర్తింపు, పరిష్కారాలకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక పీఎస్ పల్లె ప్రగతి యాప్ను రూపొందించింది. ఇందులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన కార్యకమ్రాలను నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. రోజువారీ నివేదికలను, ఆయా గ్రామాల్లో జరిగిన పనులను అప్లోడ్ చేస్తారు. పంచాయతీ కార్యదర్శులు నిక్షిప్తం చేసిన వివరాలు అధికారుల తనిఖీ యాప్లోకి వస్తాయి. తనిఖీ అధికారులైన ఎంపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోలు యాప్లోకి లాగిన్ అయి సంబంధిత పంచాయతీ వివరాలను తెలుసుకుంటారు. డీపీవో, డీఎల్పీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి యాప్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది.
పర్యవేక్షణ యాప్లో అంశాలు
పారిశుధ్య పనులు, ప్రభుత్వ సంస్థల శుభ్రత, శ్మశానవాటికల స్థితి, నర్సరీల నిర్వహణ, తోటల నిర్వహణ, జారీ చేసిన ధ్రువపత్రాలు, నమోదు పరిశీలన, ఆర్థిక లావాదేవీలు, జారీ చేసిన చెక్కుల ధ్రువీకరణ, పంచాయతీల పరిపాలన, రికార్డుల నిర్వహణ, తనిఖీల నివేదికలు, పంచాయతీ పనులకు ర్యాంకింగ్ ఇవ్వడం వంటివి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
