సమష్టి కృషితోనే కరోనా కట్టడి
ABN , First Publish Date - 2020-05-18T09:49:16+05:30 IST
సమష్టి కృషితోనే కరోనా కట్టడికి సాధ్యమని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు అన్నారు.

పటాన్చెరులో వ్యాప్తి చెందకుండా పకడ్భందీగా చర్యలు
సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు
పటాన్చెరు, మే 17: సమష్టి కృషితోనే కరోనా కట్టడికి సాధ్యమని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు అన్నారు. పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని ఎన్ఆర్ఐ సీటీ కాలనీని ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం కొవిడ్ కేసు నమోదైన ఇంటి పరిసరాల్లోని వారితో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడకూడదని, సరైన చర్యలు తీసుకుంటే కరోనా కట్టడి పెద్దసమస్య కాదని భరోసా కల్పించారు. చుట్టు పక్కల ఉన్న వారు, కాలనీవాసులు అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సోకిన బాధితులను కలిసిన ఇతరులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తీవ్రమైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్న వారు ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. పటాన్చెరు పారిశ్రామికవాడలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షీషా, వైద్యాధికారి రాథోడ్, తహశీల్దార్ మహిపాల్రెడ్డి, ఎంపీడీవో రవీందర్, సీఐ నరేష్, ఈవో మహేష్ తదితరులున్నారు.