ఇల్లు కూల్చేశారని మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-10-24T11:49:31+05:30 IST
ఎంతో కష్టపడి నిర్మించుకున్న తమ ఇంటిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా కూల్చేశారని రోదిస్తూ ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

మునిసిపల్ ఆఫీసు ఎదుట ఆందోళన
జిన్నారం, అక్టోబరు 23 : ఎంతో కష్టపడి నిర్మించుకున్న తమ ఇంటిని రెవెన్యూ అధికారులు అన్యాయంగా కూల్చేశారని రోదిస్తూ ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం కుటుంబ సభ్యులు మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీ పరిధిలో శుక్రవారం జరిగింది. గండిగూడెం గ్రామానికి చెందిన దంపతులు ప్రభాకర్, లక్ష్మి ఇటీవల ఇంటిని నిర్మించుకున్నారు. అయితే, రెవెన్యూ అధికారులు శుక్రవారం నిర్మాణాన్ని కూల్చేశారు.
దీంతో ఆవేదనకు గురైన లక్ష్మి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానిక రెవెన్యూ ఉద్యోగి ఒకరు రూ.20 వేలు లంచమివ్వాలని వేధించారని, ఇవ్వనందుకే ఇంటిని కూల్చేశారని లక్ష్మి ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ తన ఇద్దరు పిల్లలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. కాగా, సర్వే నెంబరు 216లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినందునే ఈ కట్టడాన్ని కూల్చేశామని తహసీల్దార్ దశరథ తెలిపారు.