సహకార సమరం.. ప్రశాంతం
ABN , First Publish Date - 2020-02-16T06:20:44+05:30 IST
సహకార సమరం.. ప్రశాంతం
![సహకార సమరం.. ప్రశాంతం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020021612483263/02162020005039n46.jpg)
- జిల్లాలో 20 పీఏసీఎస్లలో 133 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు
- ఓటుహక్కు వినియోగించుకున్న 27,790 మంది ఓటర్లు
- 81.6 శాతం పోలింగ్ నమోదు
- అత్యధికంగా మిట్టపల్లి సొసైటీలో 93.7 శాతం
- అత్యల్పంగా గంగాపూర్ సొసైటీలో 77 శాతం
- నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
సిద్దిపేట, ఫిబ్రవరి 15 : జిల్లాలో 20 పీఏసీఎ్సలలో ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. 133 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరుగగా 81.6 శాతం పోలింగ్ నమోదైంది. అత్యఽధికంగా మిట్టపల్లి సొసైటీ పరిధిలో 93.7శాతం, అత్యల్పంగా గంగాపూర్ సొసైటీ పరిధిలో 77 శాతం పోలింగ్ నమోదైంది. అనంతరం ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు.
జిల్లాలో 21 పీఏసీఎ్సలు ఉండగా ఇప్పటికే కటుకూరు సొసైటీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మొత్తం 273 వార్డులకు 144 స్థానాలు ఏకగ్రీవమవయ్యాయి. మిగిలిన 20 సొసైటీల పరిధిలోని 133 డైరెక్టర్ల నియోజకవర్గాలకు ఎన్నికలు సజావుగా కొనసాగాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఓట్లు తక్కువ ఉండడంతో ప్రతి ఓటూ విలువైనదిగా భావించిన అభ్యర్థులు ఓటు వేయించడానికి తంటాలు పడ్డారు. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ. ఐదు వేల వరకు ముట్టజెప్పారని సమాచారం.
చివరి గంటలో ఎక్కువగా పోలింగ్
ఎన్నికలు జరిగిన 133 ప్రాదేశిక నియోకవర్గాల్లో 34,076 మంది ఓటర్లుండగా 27,790 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8గంటల వరకు 5.2 శాతం, 9 గంటల వరకు 16.2 శాతం, 10 గంటల వరకు 34.7 శాతం, 11 గంటల వరకు 55.3 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు 72.4 శాతం, ఒంటి వరకు 81.6 శాతం ఓట్లు పోలయ్యాయి. పీఏసీఎ్సలవారీగా సిద్దిపేటలోని 5 వార్డులకు 82.4 శాతం, దుబ్బాకలోని 7 వార్డులకు 84.9 శాతం, మిట్టపల్లిలోని 11 వార్డులకు 93.7 శాతం, మిరుదొడ్డిలోని 10 వార్డులకు 84.4 శాతం, గంగాపూర్లోని 4 వార్డులకు 77 శాతం, అల్లీపూర్లోని 4 వార్డులకు 90 శాతం, నంగునూరులో 4 వార్డులకు 89 శాతం, పాలమాకులలోని 6 వార్డులకు 83.2 శాతం, గజ్వేల్లో 6 వార్డులకు 79.6 శాతం, కొండపాకలో 5 వార్డులకు 79.9 శాతం, కానుగల్లోని 3 వార్డులకు 90.4 శాతం, జగదేవ్పూర్లోని 13 వార్డులకు 77.2 శాతం, వర్గల్లోని 7 వార్డులకు 80.8 శాతం, ములుగులోని 4 వార్డులకు 78.1 శాతం, దౌల్తాబాద్లోని 2 వార్డులకు 85.2 శాతం, రేబర్తిలోని 10 వార్డులకు 79 శాతం, చేర్యాలలోని 10 వార్డులకు 80.80 శాతం, హుస్నాబాద్లోని 11 వార్డులకు 85.6 శాతం, కోహెడలోని 5 వార్డులకు 86.3 శాతం, బెజ్జంకిలోని 6 వార్డులకు 83.7 శాతం ఓట్లు పోలయ్యాయి.
పటాకులు కాల్చి, స్వీట్లు పంచి విజయోత్సవాలు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీఏసీఎ్సలకు సంబంధించిన పోలింగ్ జరుగగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల అధికారులు నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలలో విజేతలైన వారిని అనుచరులు పూలమాలలు వేసి సత్కరించారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకొని విజయోత్సవాలు జరుపుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తికాగానే విజేతలైనవారికి అధికారులు ధ్రువపత్రాలు, నేడు సొసైటీ కార్యాలయాల్లు జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటీసులను అందజేశారు.