హామీలు నెరవేర్చాలి.. లేకపోతే దూకేస్తా
ABN , First Publish Date - 2020-03-16T07:46:03+05:30 IST
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మండలంలోని చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పెట్రోల్ డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు.
వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి హల్చల్
సర్పంచ్ హామీతో దిగిన యువకుడు
హత్నూర, మార్చి 15 : ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మండలంలోని చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పెట్రోల్ డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఓ నాయకుడు అంబేడ్కర్ విగ్రహం పెట్టిస్తామని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో గెలిచి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు విగ్రహం పెట్టలేదని ఆవేదనతో బేగరి నర్సింహులు అనే యువకుడు ఆదివారం వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు.
ఎవరైనా పైకి వస్తే దూకుతానంటూ బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడితో ఫోన్లో పలు విధాలుగా నచ్చజెప్పారు. అయినా యువకుడు దిగలేదు. సర్పంచ్ సుజాతకృష్ణతో పోలీసులు ఫోన్లో మాట్లాడించగా.. అంబేడ్కర్ విగ్రహాన్ని త్వరగా ఏర్పాటు చేయిస్తానని హామీనిచ్చారు. దీంతో యువకుడు ట్యాంకు దిగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.