ప్రశాంతంగా ఎంసెట్
ABN , First Publish Date - 2020-09-29T07:29:38+05:30 IST
అగ్రికల్చర్, మెడికల్ సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రశాంతంగా
![ప్రశాంతంగా ఎంసెట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పుల్కల్/నర్సాపూర్/సిద్దిపేట ఎడ్యుకేషన్, సెప్టెంబరు 28: అగ్రికల్చర్, మెడికల్ సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. కొవిడ్ నిబంధనల మేరకు సెంటర్ల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు జరిపి, శానిటేషన్ చేసిన అనంతరం పరీక్షా హాలులోకి అనుమతించారు. సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో తొలి రోజున 200 మంది విద్యార్థులకు 184 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ బీ.బాలునాయక్ తెలిపారు. 16 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల నిర్వహించిన సెషన్లో వంద మందికి 92 మంది, మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించిన పరీక్షకు వంద మందికి 92 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ సెంటర్లో ఉదయం పూట నిర్వహించిన పరీక్షకు 217 మంది హాజరు కావాల్సి ఉండగా 187, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 218 మందికి 185 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మిప్రసాద్, ఏవో బాపిరాజు తెలిపారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ మెడిసిన్ పరీక్షను నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్లో 100 మంది విద్యార్థులకు గానూ 86 మంది హాజరయ్యారు. 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరిగిన రెండో సేషన్ లో 100 మంది విద్యార్థులకు గానూ 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు.