బ్లడ్‌బ్యాంక్‌ ఉండీ ఉపయోగం లేనట్టే!

ABN , First Publish Date - 2020-02-12T09:48:40+05:30 IST

బాబుకు జన్మనిచ్చి బాలింత మృతిచెందిన సంఘటన గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వర్గల్‌ మండలం జబ్బాపూర్‌కు చెందిన అనిత(20)కు మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి....

బ్లడ్‌బ్యాంక్‌ ఉండీ ఉపయోగం లేనట్టే!

  • ప్రసవ సమయంలో రక్తం అందుబాటులో ఉంచుకోకుండానే సిజేరియన్‌కు ఏర్పాట్లు
  • గజ్వేల్‌ ఆస్పత్రిలో తల్లి మృతి, పసికందు క్షేమం 
  • బంధువులు, కుటుంబీకుల ఆందోళన


గజ్వేల్‌, ఫిబ్రవరి 11: బాబుకు జన్మనిచ్చి బాలింత మృతిచెందిన సంఘటన గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వర్గల్‌ మండలం జబ్బాపూర్‌కు చెందిన అనిత(20)కు మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన సాయిరాజుతో పదకొండు నెలల క్రితం వివాహమైంది. గర్భిణి అయిన అనితను  ప్రసూతి కోసం తల్లిగారి గ్రామమైన జబ్బాపూర్‌కు వచ్చింది. సోమవారం రాత్రి 8గంటలకు పురిటినొప్పులు రావడంతో 108వాహనంలో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనితకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెలివరీ కోసం సర్జరీ చేయగా బాబు జన్మిచ్చాడు. డెలివెరీ సమయంలో అనితకు తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తహీనత ఏర్పడిందని వైద్యులు అన్నారు. వెంటనే మెడిసిటీకి తరలించాలని బంధువులకు సూచించడంతో వారు ప్రత్యేక వాహనంలో మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అనిత మృతిచెందిందని మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న అనిత బంధువులు, కుటుంబ సభ్యులు గజ్వేల్‌ ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనిత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. బాబును తల్లిలేని వాడిని చేశారని, జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యులు విఫలమయ్యారని మండిపడ్డారు. వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక వైద్యులు చేసే పోస్టుమార్టంపై తమకు నమ్మకం లేదని పోలీసులకు తెలుపడంతో సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో అనిత మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ విషయమై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు, శవపరీక్షల నివేదిక వచ్చిన అనంతరం పూర్తిస్థాయి వివరాలు వెల్లవడవుతాయని సీఐ ఆంజనేయులు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అనిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

Updated Date - 2020-02-12T09:48:40+05:30 IST