రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:04:09+05:30 IST

నిరుద్యోగుల పాలిట సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం శాపంగా మారిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ విమర్శించారు.

రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
సంగారెడ్డిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న బీజేవైఎం నాయకులు

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ డిమాండ్‌

నిరుద్యోగుల సమస్యలపై బీజేవైఎం రాస్తారోకో


సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 29: నిరుద్యోగుల పాలిట సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం శాపంగా మారిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిని మంగళవారం దిగ్భందించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగభృతి వెంటనే చెల్లించాలన్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొమ్మిది నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్లకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మెండి వైఖరి వీడి నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రగతి భవన్‌ను, ఫాంహౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, జగన్‌, మురళీధర్‌రెడ్డి, అశ్వంత్‌, ఆంజనేయులు, రాకేశ్‌, సాయికిరణ్‌, అరవింద్‌, శ్రీకాంత్‌, మణికంఠ, సందీప్‌, శివ, ప్రవీణ్‌, శ్రీను, రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:04:09+05:30 IST