బ్యాంకు సేవలు 4 గంటలే..!
ABN , First Publish Date - 2020-03-24T14:12:44+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతను చూపుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు...

మెదక్ అర్బన్: కరోనా వైరస్ ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూలతను చూపుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు పనిగంటలను తగ్గించాయి. ఇతర రంగాల మాదిరిగానే బ్యాంకింగ్ రంగం కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆర్యోగం కోసం పని గంటలను మార్చాయి. రోజుకు కేవలం 4 గంటలే పనిచేయనున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ఖాతాదారులను కోరుతున్నాయి. బ్యాంకులు డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా తగ్గిస్తున్నాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తుండడం ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.
31 దాకా మధ్యాహ్నం 2 గంటల వరకే...
బ్యాంకులు పనివేళల్లో మార్పులు చేశాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసిన బ్యాంకులు ఇకపై నాలుగు గంటలే పని చేయనున్నాయి. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే పని చేయనున్నారు. 31 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ అధికారులు తెలిపారు. ఖాతాదారులు సహకరించాలని వారు కోరారు.