ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం?
ABN , First Publish Date - 2020-12-28T04:57:56+05:30 IST
కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిలో ఆదివారం కొందరు మట్టిని వేసి కబ్జాకు ప్రయత్నించారు.

రామచంద్రాపురం, డిసెంబరు 27: కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిలో ఆదివారం కొందరు మట్టిని వేసి కబ్జాకు ప్రయత్నించారు. విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారులకు చేరవేయడంతో స్పందించిన అధికారులు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలం గల వెలిమెలలోని ప్రభుత్వ సర్వే నంబరు 15 లో సుమారు ఎకరం పైచిలుకు భూమిలో కొందరు వ్యక్తులు లారీల కొద్ది మట్టిని వేస్తూ భూమిని చదును చేసే పనులు చేపట్టారు. విషయాన్ని స్థానికులు డీటీ విశ్వేశ్వర్కు చేరవేశారు. డీటీ ఆదేశాలతో వీఆర్వో రాజమల్లేశం సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఇలా ఉండగా వెలిమెలలో బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర రూ. 12 కోట్ల వరకు పలకడంతో భూ బకాసురుల కళ్లు ప్రభుత్వ భూములపై పడుతున్నాయి. డీటీ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో మట్టిని వేసిన విషయమై విచారణ చేపట్టి, బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.