రెండు రోజుల్లో రూ.9.50 కోట్లు
ABN , First Publish Date - 2020-05-08T06:56:15+05:30 IST
లాక్డౌన్ తర్వాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి.
మెదక్, సంగారెడ్డి జిల్లాలో జోరుగా మద్యం విక్రయాలు
మెదక్, మే 7: లాక్డౌన్ తర్వాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘణపూర్లో ఉన్న ఐఎంఎల్ డిపో నుంచి భారీ స్థాయిలో మద్యాన్ని అమ్మకందారులు దిగుమతి చేసుకున్నారు. ఐఎంఎల్ డిపో పరిధిలో 107 వైన్స్ షాపులకు స్టాక్ పంపిణీ అవుతుండగా ఇందులో కామారెడ్డి జిల్లాలోని ఒక వైన్స్ షాప్ కూడా ఈ డిపో పరిధిలోకే అధికారులు చేర్చారు. లాక్డౌన్ నుంచి మద్యం విక్రయాలకు సడలింపు ఇవ్వడంతో బుధ, గురు వారాల్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రూ.9కోట్ల 41లక్షల విలువైన మద్యాన్ని వైన్స్ షాపుల నిర్వాహకులు డిపో నుంచి దిగుమతి చేసుకోవడం రికార్డు.
మెదక్ జిల్లాలో 38 వైన్స్ షాపులు ఉండగా సంగారెడ్డిలో 70 షాపులు ఉన్నాయి. బుధవారం 67 వైన్స్ దుకాణాల నిర్వాహకులు రూ.4 కోట్ల 85 లక్షల మద్యాన్ని చిన్నఘణపూర్లోని ఐఎంఎల్ డిపో నుండి వైన్స్ యజమానులు కొనుగోలు చేశారు. మిగతా దుకాణాల నిర్వాహకులు వారి వద్ద స్టాక్ ఉండడంతో ఐఎంఎల్ డిపో నుంచి స్టాక్ దిగుమతి చేసుకోలేదు. గురువారం 71 షాపుల నిర్వాహకులు రూ.4 కోట్ల 56 లక్షల మద్యాన్ని కొనుగోలు చేశారు.