10లోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలి
ABN , First Publish Date - 2020-12-06T06:01:07+05:30 IST
పల్లె ప్రకృతి వనాలు ఈ నెల 10లోగా వంద శాతం పూర్తి కావాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

అధికారులతో సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షి షా
నూతన గృహాలన్నింటికీ భగీరథ కనెక్షన్లను ఇవ్వాలి
జిల్లాలో 5వేల కల్లాల నిర్మాణం లక్ష్యం
ఎంపీడీవోలు ప్రతీ రోజు సమీక్షించాలి
సంగారెడ్డి రూరల్, డిసెంబరు 5: పల్లె ప్రకృతి వనాలు ఈ నెల 10లోగా వంద శాతం పూర్తి కావాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 5వేల కల్లాల నిర్మాణం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. కొత్తగా నిర్మించే గృహాలన్నింటికీ మిషన్ భగీరథ కనెక్షన్లను ఇవ్వాలని సంబంధిత డీఈలను ఆదేశించారు. కనెక్షన్లకు సంబంధించి ఏవైనా అసంపూర్తి పనులు ఉన్నట్లయితే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విలేజ్ వాటర్ నెట్వర్క్ మ్యాప్లను ఆయన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని చెప్పారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్స్ వద్ద మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలని, పైప్లైన్లు ధ్వంసం కాకుండా ఏ పనులు ప్రారంభించినా మందుగా ఏఈలతో మాట్లాడి మొదలు పెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
నీటి వృథాపై చర్యలు తీసుకోవాలి
అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులను కట్ చేయడమే కాకుండా టాప్స్ తీసివేసి నీరు వృఽథా చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని రాజర్షి షా వివరించారు. అలాంటి పనులు చేసేవారిని గుర్తించి, వారికి నీటి సరఫరాను తక్షణమే నిలిపివేయాలని తెలిపారు. ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే కేసులు నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పల్లె పకృతి వనాల గ్రౌండింగ్, నర్సరీలు ఈ నెల 10లోగా పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. డ్రాయింగ్ ఫ్లాట్ఫామ్లను వేగంతంగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని, జిల్లాలో 5వేల కల్లాల నిర్మాణం లక్ష్యం కాగా, ప్రతీ గ్రామంలో 10 చొప్పున ఈ నెల 15లోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు ప్రతీ రోజు పర్యవేక్షించి సమీక్షించాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్టు తయారు కావాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. సమావేశంలో అర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సతీష్రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.