మాసాయిపేట మండలం ఏర్పాటు వేగవంతం
ABN , First Publish Date - 2020-12-29T05:21:07+05:30 IST
మాసాయిపేట కొత్త మండలం ఏర్పాటును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేయగా, ప్రజలకు కొత్త మండల సమాచారం తెలిసే విధంగా నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సిందిగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదేశించారు.
తూప్రాన్, డిసెంబరు 28 : మాసాయిపేట కొత్త మండలం ఏర్పాటును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో కొత్త మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేయగా, ప్రజలకు కొత్త మండల సమాచారం తెలిసే విధంగా నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సిందిగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నూతనంగా 9 రెవెన్యూ గ్రామాలతో మాసాయిపేట మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 24న ఉత్తర్వులు జారీచేసిందని కలెక్టర్ వెంకట్రామారెడ్డి వివరించారు. వెల్దుర్తి మండలంలోని ఆరు రెవెన్యూ గ్రామాలు మాసాయిపేట, రామంతాపూర్, లింగారెడ్డిపల్లి, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, చేగుంట మండలంలోని మూడు రెవెన్యూ గ్రామాలు చెట్లతిమ్మాయిపల్లి, పోతన్పల్లి, పొతన్శెట్టిపల్లితో కలిపి మాసాయిపేటను మండలంగా ఏర్పాటు చేసి తుది జాబితాను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసే విధంగా జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాలవారీగా మున్సిపల్ కమిషనర్, తూప్రాన్, మెదక్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్, మండల పరిషత్ కార్యాలయాల్లో జీవో 152ను నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సిందిగా కలెక్టర్ సూచించారు. ఈ ఉత్తర్వులను నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ పొంది తుది నివేదిక సమర్పించాల్సిందిగా కలెక్టర్ తూప్రాన్, నర్సాపూర్, మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారులను కోరారు.